నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, June 21, 2015

పితరౌ వందే !

ఆది గురువు లాంటి తండ్రి ని తల్చుకోవటానికి ప్రత్యేకంగా రోజులు అక్కరలేదని తెలిసినా, ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా తెలుగు వెలుగు పత్రిక కోసం నేను రాసిన చిరు వ్యాసం.




పితరౌ వందే !
ఒక వ్యక్తిగా , ఒక రచయిత గా నా మీద మా నాన్నగారు రెంటాల గోపాలకృష్ణ గారి  ప్రభావం ఎంతగానో ఉంది. నాకు ఉహా తెలిసేనాటికే మా నాన్నగారు ప్రసిద్ధ రచయిత. ఆయన ఒక తండ్రిగా కంటే ఒక రచయిత గానే నాకు ఎక్కువ తెలిసినట్లు ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడు అనిపిస్తుంది. ఆయన తన పిల్లల్ని చిన్నతనం నుంచే ఒక మంచి రచయిత, లేదా మంచి పాఠకులు అయ్యేలాగా పెంచారు. ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎలా చదవాలి,ఎందుకు చదవాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి లాంటి విషయాలను చాలా చక్కగా, ఓపికగా వివరించేవారు. అది మాకు నిత్యజీవితం లో మామూలు చదువులకు, సాహిత్య పఠనానికి రెండింటికీ ఉపయోగపడింది.
ఒక రచయితకు సాహిత్యం పట్ల ఎలాంటి నిబద్ధత ఉండాలో దాదాపు 200 పుస్తకాలు రాసిన  మా నాన్న గారిని చూసి నాతొ సహా, ఈ తరం రచయితలందరూ తప్పక నేర్చుకోవాల్సిన జీవన పాఠం .
 ఆయనకు రచన ఒక passion. ఒక తపస్సు.  ప్రతి రోజూ ఉదయం నియమంగా క్రమం తప్పకుండా రాసేవారు. జర్నలిస్ట్ గా తీవ్ర పని ఒత్తిడుల మధ్య కూడా ఆయన అన్ని పుస్తకాలు రాయగలిగారంటే ఆయనకు సాహిత్యం పట్ల ఉన్న ప్రేమ, ఆయనకు అందులో ఉన్న ప్రావీణ్యం రెండూ అర్థం చేసుకోవచ్చు. ఇవాళ, రేపు అలాంటి రచయితలు మనకు కనిపించటం లేదు.  కేవలం బుద్ధి పుట్టినప్పుడు రాయడం, డబ్బు కోసమో, కీర్తి కోసమో రాయటమో కాదు ఆయన  చేసినది. ఆయనకు  రచన ఒక  సామాజిక బాధ్యత గా కూడా అర్థమయింది. ఏం రాయాలో, ఎందుకు రాయాలో,ఎలా రాయాలో తెలిసి ఆ పని చేసారు. ఒక రచయితగా  కేవలం రాయటం మాత్రమే కాకుండా, తప్పనిసరిగా ప్రతి రోజూ ఏదో ఒక పుస్తకం  చదివేవారు. భారతీయ భాషల సాహిత్యం తో పాటు, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ లాంటి ఇతర దేశాల సాహిత్యం కూడా చదివి ఆకళింపు చేసుకొని వాటిని అనువాదం చేసేవారు. మా నాన్నగారి తరం లో వచ్చినన్ని అనువాదాలు ఇప్పుడు రాకపోవటం ఒక విషాదం.
మా ఇంట్లో మాకున్న అతి విలువైన ఆస్తి రెండు పెద్ద బీరువాల్లోని  పుస్తకాలు. చదవటానికి పిల్లలకు ఒక్కో పుస్తకం మాత్రమే ఇచ్చేవారు. అది చదివి, అర్థం చేసుకున్నాకే మరొక పుస్తకం తీసుకోవాలనే నిబంధన పెట్టారు. దానివల్ల మాకు పుస్తకాల విలువ, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవటం రెండూ అర్థమయ్యాయి. పుస్తకాలు చదివాక వాటి గురించి  ఆయన తో చర్చించటం వల్ల రచనలను ఎలా అర్థం చేసుకోవాలో తెలిసేది. ఇలా రచయితలకు, పాఠకులకు  ఉండాల్సిన లక్షణాల్ని ఆయన చిన్నతనం నుంచే మాకు నేర్పించారు. రచయితలు గా, జర్నలిస్టు లు గా  స్థిరపడింది మా పెద్దన్నయ్య జూనియర్ రెంటాల,  నేను, మా తమ్ముడు జయదేవే బయట ప్రపంచానికి తెలిసినప్పటికీ మిగతా పిల్లలందరూ కూడా మంచి పుస్తకాలు  చదువుతారు, వాటి గురించి విశ్లేషణాత్మకం గా మాట్లాడతారు.
ఆయన ఏ రోజూ తన రచనలకు ఇంత కావాలని అడిగి తీసుకోలేదు. పబ్లిషర్ ఇచ్చేది అతి చిన్న మొత్తమే అయినా కూడా ఆయన ఏ రోజూ బాధపడలేదు. ఇంత కావాలని బేరం పెట్టలేదు. సరస్వతి ని అమ్ముకోవటం తప్పని బాధపడేవారు. అందువల్లే పబ్లిషర్ ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు. ఒక్కో పుస్తకం ఎన్ని ముద్రణలు జరిగినా పబ్లిషర్ నుంచి అదనపు పారితోషకం అడగలేదు. కనీసం తనకంటూ కొన్ని పుస్తకాలు కూడా అడిగి తీసుకునేవారు కాదు. అందుకే ఇవాల్టికి మా దగ్గర మా నాన్నగారి పుస్తకాలు మొదటి ముద్రణలే చాల శిథిలావస్థ లో ఉన్నాయి. కాకాపోతే తను రాసిన ప్రతి రచన పదిలంగా దాచి ఉంచేవారు. అంత పెద్ద రచయిత జీవితపు చరమాంకం లో కవిత్వ పుస్తకం కూడా సొంతంగా వేసుకునే ఆర్ధిక స్థోమత లేక కన్నుమూసారు. ఇలా చెప్పుకుంటూ పొతే ఆయన గురించి ఎన్నో విషయాలు, ఒక రచయిత గా నేను , నాతొ పాటు ఈ తరం రచయితలందరూ తెలుసుకొని ఆచరించాల్సినవి. సాహిత్య రచన అనేది మనం జీవించటానికి ఒక కెరియర్ కాదు. అది మనల్ని జీవింప చేసే ఒక ప్రాణవాయువు. ఆయన జీవితం ద్వారా నేను తెల్సుకున్న జీవిత సత్యం ఇదే.
--కల్పనారెంటాల 


0 వ్యాఖ్యలు:

 
Real Time Web Analytics