నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Monday, July 30, 2012

విస్మృతి



నిద్ర నాకు గాయాన్ని కానుక చేసింది
గాయం నాకు రాత్రిని కానుక చేసింది
ఈ రాత్రినేం చేసుకోను?
ఈ చీకటి ని ఎలా మూట కట్టుకోను?

నిద్ర పెట్టె తీసి
చంద్రకాంత శిలా నేత్రాలను తెరిచాను
కన్నీటి ని దాచుకుంది దుఃఖం

నిద్ర రాదు
కలలూ రావూ
నిజాల్ని అబద్ధాలుగా చూడటం ఎలా?

నిద్రంటే
నిజాల్ని దాచుకోవటమేగా?
కలలంటే
స్మృతుల్ని ఎగరేయటమేగా?
ఏ నిజ సూర్య కిరణం లోంచో
నిద్ర వస్తూ ఉంటుంది
నా పార్ధివ కాంక్షల్ని
భుజాన మోసుకెళ్ళేందుకు

వెళుతూ వెళుతూ
ఓ అబద్ధాన్ని జారవిడిచింది
అది పగలై నన్ను నిద్రపుచ్చింది
పసిపాపై జోల పాడింది

(ప్రజాతంత్ర సాహిత్య సంచిక , 2001 )


Saaranga Books is Hiring in Hyderabad



Saaranga Publications is looking to hire one person for an operations manager plus proof editing tasks. This person should be based in Hyderabad. The essential tasks that this person is expected to do are as follows:

- Manage Saaranga books affairs as per Publisher's instructions, including working with and managing relations with printers, distributors, online and retail book sellers

- Perform initial copy editing and proof checking for Telugu books that are published by Saaranga

- Work with composing / typesetting service companies to make sure Saaranga jobs are completed in a timely fashion

- As a rule this job requires frequent communication with the Publisher in the U.S., over phone, email, and instant messaging means. Saaranga places the highest priority to the professional communication skills above every other technical skill for this job. 

- In general, ability to use Microsoft Word or any other document preparation software will be a minimum computer skill required. Ability to type in Telugu will be necessary for this job, but it is not necessary to start this job. 

- Please contact Raj Karamchedu, Publisher of Saaranga Books, at raj@saarangabooks.com with your background information including the phone number where you can be reached.

Saturday, July 21, 2012

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా !

సాక్షి ఆదివారం సంచిక లో (జూలై 22) ప్రవాసం శీర్షిక కోసం నేను రాసిన వ్యాసం ఇది.






అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు తమ కోసం ఓ లిటిల్ ఇండియాను సృష్టించుకుంటుంటే, ఇండియాలోని వారు అక్కడొక మినీ అమెరికాను ఏర్పాటు చేసుకుంటున్నారు.

అమెరికన్ సమాజంలో ఇండియన్‌లాగా జీవించటంలో ఉండే అనుభవాల గురించి మాట్లాడాల్సి వస్తే... ముందుగా రెండు దేశాల మధ్య వైరుధ్యం కన్నా రెండు దేశాల జీవన విధానంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న మార్పుల గురించి చెప్పాలనిపిస్తుంది. ఈ వ్యాసం మొత్తంలో నేను అన్నది వైయక్తికమైన నేను కాకుండా సామాజికమైన నేనుగా వాడుతున్నాను.

పదేళ్లుగా అమెరికాలో నివసించటం మొదలుపెట్టిన దగ్గర నుంచీ నేను, నాలాంటివాళ్లు ఎందరో ఎదుర్కొనే అతి సాధారణ ప్రశ్న/మొదటి ప్రశ్న-‘నువ్వు నీ మాతృదేశాన్ని మిస్ అవుతున్నావా?’ మిస్ అవటమన్న సంకర పద ప్రయోగంలోనే మనం చాలావరకు మారిన పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. మిస్ అవటమంటే... దూరంగా ఉన్న అనుభూతి, ఏదో కోల్పోయిన అనుభూతి. నేను నిజంగా మాతృదేశాన్ని, మాతృభాషను పోగొట్టుకున్నానా? లేదు. కేవలం భౌతికమైన దూరంలో బతుకుతున్నాను.
 
 అప్పుడు-ఇప్పుడు

గత ఇరవై ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికపరంగా, ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ఉదారవాద సంస్కరణల ఫలితంగా అమెరికా-ఇండియాల మధ్య దూరం బాగా తగ్గిపోయింది. ఓడ ఎక్కితే కానీ మొదటి తరం తెలుగువారు అమెరికా రాలేకపోయారు. ఇప్పుడు 15 నుంచి 18 గంటల ప్రయాణంతోనే అటూ ఇటూ రాకపోకలు సాగుతున్నాయి. 30 ఏళ్ల క్రితం ఆంధ్ర దేశం నుంచి వచ్చిన ఓ స్నేహితు రాలికి తల్లి మరణవార్త పది రోజుల తర్వాత ఉత్తరం ద్వారా తెలిసింది.

ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ఇవాళ ఇండియా-అమెరికాల మధ్య స్కైప్‌లు, వానేజీ ఫోన్లు, రోకూ బాక్సులు, ఇంటర్నెట్ టీవీలు, ఈమెయిల్స్, చాట్‌లు, సోషల్ నెట్‌వర్కులు, టీవీ చానెళ్ల ప్రత్యక్ష ప్రసారాలు ఎన్నో వచ్చేశాయి. ప్రతి కొత్త తెలుగు సినిమా అటు ఇండియా, ఇటు అమెరికాలో ఒకేసారి విడుదల అవుతోంది. టీవీ కార్యక్రమాల సంగతి చెప్పనే అక్కరలేదు. రెండు దేశాల మధ్య కాలమానం తేడాలున్నప్పటికీ, ఇండియాలో ఏ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే కార్యక్రమమైనా, అదే సమయంలో అమెరికాలో ఉన్నవారు కూడా ఆ కార్యక్రమాన్ని వీక్షించే సదుపాయాలు వచ్చేశాయి.

ఆహార వ్యవహారాలు, పండుగల పబ్బాల విషయానికి వస్తే... మామూలుగా మహారాష్ట్ర, గుజరాత్‌లలో పండే అల్ఫాన్సా, కేసర్ మామిడిపళ్లతో సరిపెట్టుకునే ఇండియన్ అమెరికన్లు ఇవాళ బంగినపల్లి మామిడిపళ్లను కూడా ఆరగించగలుగుతున్నారు. అమెరికాలోని ప్రతి నైబర్‌హుడ్‌లోనూ ఓ రెండు, మూడు యోగా సెంటర్లు ఉంటాయి.

హిందూ దేవాలయం లేని అమెరికా పట్టణాలు అతి తక్కువ. రెండోతరం, మూడోతరం పిల్లలు, యువతీ యువకులు తెలుగు భాషను, మన బడులు-తెలుగుబడుల్లో నేర్చుకుంటున్నారు. తెలుగువారిని పెళ్లి చేసుకున్న అమెరికన్లు కూడా ఆసక్తిగా తెలుగు నేర్చుకుంటున్నారు. తెలుగు వంటకాలను రుచి చూస్తూ, ఆచార వ్యవహారాలను ఆకళింపు చేసుకుంటున్నారు.

సాహిత్యపరంగా వచ్చిన మార్పులను చూస్తే, ప్రవాసాంధ్ర తెలుగు సాహిత్యం అనేది ప్రధాన స్రవంతి తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. అమెరికాను చుట్టపు చూపుగా చూడటానికి వచ్చి వెళ్లిపోయే వాళ్ల అమెరికా అనుభవాల నుంచి మాత్రమే ఒకప్పుడు తెలుగువారు అమెరికా గురించి తెలుసుకునేవారు. గత పదేళ్లలో అమెరికాలో నివసిస్తున్న పాత, కొత్త రచయితల కలాల నుంచి అమెరికాలో తెలుగువారి జీవితాల గురించిన సాహిత్య చిత్రణ ఎక్కువయింది.

ఈ మార్పులన్నింటి ద్వారా ఏం అర్థమవుతోంది? అమెరికాలోని తెలుగువారు తమ భాషను కాని, తమ సంస్కృతిని కాని, ఆచార వ్యవహారాలను కాని, తమ భారతీయతను కాని వేటినీ వదులుకోవటం లేదు. తమ మూలాల్ని వదులుకోవటానికి వారెవ్వరూ సిద్ధంగా లేరు. తమ భారతీయతను దేనికీ ఫణంగా పెట్టడం లేదు.

అమెరికాలో ఇండియన్‌లాగా నివసించటంలో చెప్పుకోదగ్గ ఇబ్బందులు లేవు. కానీ ఇప్పుడు ఇండియాలో ఇండియన్‌లాగా నివసించటం మీదనే నాకు అనేక సందేహాలున్నాయి.
రెండు దశాబ్దాల కిందట భారతదేశం తన ఆర్థిక వ్యవస్థ తలుపుల్ని బార్లా తెరిచినప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళనతోను, ఆసక్తితోను అందరూ గమనించటం మొదలుపెట్టారు.

ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలాంటి పెను మార్పులు సంభవించాయో ఎవరైనా సులభంగా తెలుసుకోవచ్చు. షాపింగ్‌మాల్స్, గ్లాస్ పానెల్డ్ ఆఫీస్ బిల్డింగులు, ఎస్కలేటర్లు పుట్టుకొచ్చాయి. పల్లెటూళ్ల స్వరూపం మారిపోయింది. పట్టణాలు ఆధునికత వికృత స్వరూపానికి నకళ్లుగా మారాయి. ఇండియా అంటే ఎప్పటి ఇండియా అని అడగాలనిపిస్తుంది.

అమెరికాలో తెలుగు నేర్చుకున్న రెండోతరం, మూడోతరం తెలుగు యువతీయువకులు సెలవుల్లోనో, పరిశోధన కోసమో ఇండియా వెళ్లి వెనక్కి వచ్చాక, ‘అక్కడి వాళ్ల కన్నా మేమే మంచి తెలుగు మాట్లాడుతున్నాం’, ‘అక్కడ మేం తెలుగులో మాట్లాడుతుంటే అందరూ మాతో ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారు’ అని చెప్తున్నారు. తెలుగు సినిమాలు చూడటానికి ఇంగ్లిష్, హిందీ వస్తే చాలు తెలుగు రానక్కరలేదు అన్నది ఇవాళ అమెరికాలో ఉన్న తెలుగు పిల్లల మనోభావం. మన తెలుగు సినిమాల్లో తెలుగు నేతి బీరకాయల్లో నెయ్యి చందాన ఉంటోందన్నది అక్షర సత్యం.

తెలుగు తిట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నేను అనటం లేదు కానీ, అవి పుష్కలంగా ఇంకా అమెరికాలో తెలుగువారి నోళ్లల్లో ‘నీయమ్మ, నీయబ్బ’లుగా నానుతూనే ఉన్నాయి. కానీ ఇండియాలో అమెరికన్ తిట్లు, లేదా ఊతపదాలు ‘ఎఫ్-వర్డ్’, ‘ఎస్-వర్డ్’ ఎలాంటి సంకోచాలు లేకుండా వాడటం కనిపిస్తోంది.

అమెరికాలో తెలుగు పిల్లలు చక్కగా లంగా ఓణీలు వేసుకుని సంగీతం, కూచిపూడి లాంటి లలితకళలను శ్రద్ధగా అభ్యసిస్తుంటే తెలుగుదేశంలో పిల్లల వస్త్రధారణ, టీవీ కార్యక్రమాల్లో వారి ప్రదర్శనలు చూస్తుంటే అటుదిటు, ఇటుదటు మారిపోయినట్లు అనిపిస్తోంది. వస్త్రధారణల్లో వచ్చిన మార్పులు, ఇంగ్లిష్ భాష మాట్లాడటం ఒక నేరంగా నేను ఎత్తి చూపటం లేదు.

ఒక మార్పుకి సంకేతంగా మాత్రమే చెప్తున్నాను. ఇండియాలో తెలుగు పిల్లలకు మాట్లాడే తెలుగు వస్తే గొప్ప. అమెరికాలో తెలుగు పిల్లలు తెలుగులో చదవటమే కాదు, తెలుగులో రాయగలిగే స్థాయికి వెళ్తున్నారు. రాబోయే తరం నుంచి ఓ అమెరికన్ ఇండియన్ తెలుగులో ఓ పుస్తకం రాసే రోజు కూడా ముందు ముందు ఉందన్న ఆశ కలుగుతోంది.

అమెరికనైజ్ అయిపోతున్న ఇండియా నన్ను ఆందోళన పరుస్తున్నది. మొన్నటి మెక్‌డొనాల్డ్స్, నిన్నటి వాల్‌మార్ట్‌లు, ఇవాళ్టి స్టార్ బక్స్, అమెజాన్ మార్కెట్ల రంగప్రవేశంతో నాకు ఇండియా ఇండియాలాగా కనిపించటం లేదు. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు తమ కోసం ఓ లిటిల్ ఇండియాను సృష్టించుకుంటుంటే, ఇండియాలోని వారు అక్కడొక మినీ అమెరికాను ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా భారతీయతను కోల్పోవటం అంటూ జరిగితే అది అమెరికాలో జరగటం లేదు. భారతదేశంలోనే మనం మన భారతీయతను కోల్పోతున్నామేమో అనిపిస్తోంది.

ప్రపంచమొక కుగ్రామం అన్న మాట ఈ పదేళ్ల ప్రవాస జీవితం తర్వాత బాగా అనుభవంలోకి వస్తోంది. అమెరికా రావటానికి ముందు ఈ దేశం గురించి నా ఆలోచనలు, నా అవగాహన వేరు. కానీ ఇక్కడికొచ్చాక నాకు కలిగిన అనుభవాలు వేరు. ఆ అనుభవాలు నాకు అమెరికా గురించిన అవగాహనను పెంచడంతో పాటు నా మాతృదేశాన్ని చూడాల్సిన దృష్టిని కూడా ఇచ్చాయి.

ఈ రెండు దేశాలు నాకు రెండు కళ్లలాగా, సొంత ఇళ్లలాగానే కనిపిస్తున్నాయి. సామాజికంగా, సాంస్కృతికంగా, భాషల పరంగా ఈ రెండు దేశాలు భూగోళానికి చెరోవైపు ఉన్నాయి. కానీ నా మనసులో రెండింటికీ ఒకటే స్థానం ఉంది. ఒకటి పుట్టిల్లు, ఒకటి అత్తిల్లు కాదు. రెండూ పుట్టిళ్ల లాగానే కనిపిస్తున్నాయి. కేవలం ఒక కంటితో మాత్రమే చూసే పాక్షిక దృష్టి నాకొద్దు.

ఈ రెండు దేశాల జీవితానుభవంతో సమగ్రమైన దృష్టికోణం అలవడింది. ఆ సమ్యక్ దృష్టితోనే ఈ ప్రవాస సమాజంలో కూడా నా ఉనికిని నేను కాపాడుకోగలుగుతున్నాను. నా మూలాల్ని నేను గుర్తుపెట్టుకోగలుగుతున్నాను.నేను అమెరికాలో నివసిస్తున్న భారతీయురాలిని అని సగర్వంగా చెప్పుకోగలను.

-కల్పనా రెంటాల

Monday, July 16, 2012

గౌహతీ దుశ్చర్య సాక్షిగా ......మేరా భారత్ మహాన్!



“భారత దేశం నా మాతృదేశం. భారతీయులందరూ నా సహోదరులు. “ 

చిన్నప్పుడు స్కూల్లో చదివిన ప్రతిజ్న ఇంకా నా చెవుల్లో గింగురుమంటూనే వుంది. 

అనుక్షణం నా దేశం గొప్పతనం , నా “ సహోదరులకు”  స్త్రీజాతి పట్ల వున్న ఆదరాభిమానాలు , స్త్రీ ని దేవత గా కొలిచే నా దేశ సంస్కృతి గురించి  ప్రతి రోజూ ఎవరో ఒకరు నాకు  ఉద్బోధ చేస్తూనే  ఉన్నారు.  

గత వారం గౌహతి లో జరిగిన సంఘటన ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అది తెలిసాక ఎంత మంది తల్లితండ్రులు తమ ఆడపిల్లలను సాయంత్రాలు బయటకు వెళ్లద్దని మరింత కట్టడి చేస్తున్నారో నాకు తెలియదు. 

గౌహతి లో ఓ పదిహేదేళ్ళ అమ్మాయి తన స్నేహితులలతో కలిసి రెస్టారెంట్  కమ్ పబ్ లోకి వెళ్ళి గడిపి బయటకు వచ్చింది. ఆ అమ్మాయి తో పాటు ఆమె స్నేహితులు కూడా వున్నారు. ఓ అమ్మాయి అర్థరాత్రి అబ్బాయిలతో కలిసి పబ్ నుంచి బయటకు రావడాన్ని అక్కడున్న ఓ ఓ గుంపు చూసి  తట్టుకోలేకపోయింది. దేశ ఔన్నత్యం దిగజారుతోందని  ఆ మూక కు ఆవేశమొచ్చింది. ఆ అమ్మాయి పొట్టి స్కర్ట్ వేసుకుందని, అర్థ రాత్రి తాగి తందనాలాడుతోంది కాబట్టి ఆమెకు బుద్ధి చెప్పాలనుకున్నారు. అందరూ కలిసి ఆమె చుట్టూ ఓ గుంపు లా , ఓ వలయం లా ఏర్పడి ఆమె ను కొట్టి ఆ తర్వాత ఆమె వొంటి మీద వున్న ఆ కొద్ది పాటి దుస్తులను కూడా తీసేసి ఆనందించారు. ఆమె ను ఎక్కడెక్కడో తాకి ఆనందించారు. ఆమె ను నడి రోడ్డు మీద లాక్కెళ్లారు. ఈ పనులన్నీ చేసింది ఓ 20 మంది తో కూడిన గుంపు. కానీ దీన్ని చూసిన ఆనందించినవారు వంద సంఖ్య లో వున్నారు. ఎక్కడ అరక్షణం కళ్ళు తిప్పితే ఎంత మంచి సీన్ మిస్ అవుతామో అన్నట్లు కళ్లార్పకుండా చూశారు. రద్దీ గా ఉండే రోడ్డు మీద ఈ దుర్ఘటన చూస్తూ కూడా ఎవరూ ఆగి దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు.  సహాయం చేయమని ఆ అమ్మాయి రోడ్డు మీద పరుగెత్తినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఆ సమయం లో అటు వైపు వస్తున్న మరో జర్నలిస్ట్ కారు ఆపి పోలీసులకు ఫోన్ చేసి ఆ అమ్మాయి ని అల్లరి మూకల నుంచి కాపాడే ప్రయత్నం చేశాడు. 

అల్లరి మూకల  గుంపు లో ఒక  జర్నలిస్ట్ కూడా ఉన్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్ “ ని అతనితో సహా అనేక మంది   కెమెరాలతో చిత్రీకరించారు. ఆ తర్వాత ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశారు. న్యూస్ ఛానెల్స్ లో ప్రసారం చేశారు. ఒక జర్నలిస్ట్ ఆ అమ్మాయి మీద దాడి ని ప్రోత్సహిస్తే మరో జర్నలిస్ట్  వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఈ దురాగతానికి అడ్డుకట్ట వేసి ఆ అమ్మాయి ని కాపాడారు. 

ఈ మొత్తం సంఘటన ను ప్రత్యక్ష్యంగా చూసి, వీడియో తీసి, తన వంతు భాగస్వామ్యం వహించిన  జర్నలిస్ట్ తన చానెల్ లో Drunk girl in the city” అనే శీర్షికతో న్యూస్ ప్రసారం చేశాడు. అది చూసి మిగతా పత్రికలు, ఛానెల్స్ కూడా ఆ తరహా వార్తలే వినిపించాయి. . ఒకటిన్నర రోజు తర్వాత  అసలు విషయం బయటకు వచ్చాక, యూ ట్యూబ్ లో వీడియో లు కూడా అందరూ చూసి ఆనందించాక అప్పుడు అందరూ రంగం లోకి దిగారు. అసలేం జరిగిందో బయటకు వచ్చింది. నిందితుల కోసం వెతుకులాట మొదలయింది. ధర్నాలు, రాస్తారోకోలు జరిగుతున్నాయి. మొదట ఈ వార్త ను ప్రసారం చేసిన న్యూస్ చానెల్ కొంత మాట మార్చింది. నేటి యువతరం ముఖ్యంగా అమ్మాయిలు ఎంత చెడిపోతున్నారో, అసభ్యకరమైన దుస్తులు వేసుకొని అర్థ రాత్రి వరకు పబ్ ల వెంట ఎలా తిరుగుతున్నారో  , అలా తిరిగితే ఏం జరుగుతుందో హెచ్చరికలు మొదలు పెట్టింది. ఒక న్యూస్ చానల్ ఎడిటర్ కామెంట్ ఏమిటంటే “Major chunk of girls visiting pubs/bars are prostitutes”.
ఈ వీడియో ని చూస్తే ఏం జరిగిందో ఎవరికైనా అర్థమవుతుంది.
ఆ అమ్మాయిని రక్షించిన జర్నలిస్ట్ తో ఇంటర్వ్యూ ని ఇక్కడ చదవండి.
http://news.biharprabha.com/2012/07/meet-the-man-who-saved-guwahati-girl-from-molestation/

ఆడపిల్లల స్కర్ట్ లు ఎంత పొడవు  ఉండాలో కాదు నిర్ణయించాల్సింది. కొందరు మగవాళ్ళు మృగాల్లా కాకుండా మామూలు మనుషుల్లా ప్రవర్తించేలా ఎవరైనా వారికి శిక్షణ ఇవ్వండి.
అది జరిగితే , నిస్సందేహంగా నా దేశం గొప్పదే!




Sunday, July 08, 2012

కీలుబొమ్మలు నవల పై ఓ సంభాషణ


డాలస్ లోని  రేడియో ఖుషీ ఆధ్వర్యం లో  మదర్స్ డే సందర్భం గా  మహిళా సంబరాల కార్యక్రమం జరిగింది. వివిధ రంగాల్లో కృషి చేసిన మహిళలను సన్మానించటం లో భాగం గా సాహిత్య రంగం లో  మేం చేసిన కృషి ని గుర్తిస్తూ నాకు, మాలతి గారికి కూడా సన్మానం  చేశారు. సన్మాన కార్యక్రమాలు ఎలా ఉంటాయో, ఎలా జరుగుతాయో బాగానే అనుభవం వున్న మేమిద్దరం  ఆ కార్యక్రమం కంటే కూడా ఆ సందర్భంగా మేమిద్దరం ఒక పూట గడిపే అవకాశం కోసం ఎదురుచూసాము.    ప్రముఖ నవలా రచయిత జి‌.వి. కృష్ణారావు గారు రాసిన నవల “ కీలుబొమ్మలు” చదవటం అప్పుడే  మేమిద్దరం కూడా పూర్తి చేశాము కాబట్టి దాని మీద మాట్లాడాలని అప్పటికప్పుడు అనుకున్నాము. ఇదేదో పెద్ద సాహిత్య చర్చ లాగా కాకుండా చాలా మామూలుగా మేమిద్దరం మా అభిప్రాయాలూ ఒకరితో మరొకరం పంచుకున్నాము. దోసెలు, అరటికాయ కూర, మామిడి  కాయ పప్పు, చింత చిగురు పొడి  తో మంచి రుచికరమైన భోజనం పెట్టడం తో పాటు మా మాటలను ఆడియో, వీడియో ల రూపం లో భద్రపరిచిన మాలతి నిడదవోలు గారికి నా కృతజ్నతలు.
కీలు బొమ్మల పై , ఇతర సాహిత్య విషయాల పై మా ఇద్దరి సంభాషణ ఆడియో, వీడియో ల రూపం లో ఇక్కడ వినండి, చూడండి.
ఆడియో -
http://archive.org/details/InterviewWithKalpanaAndMalarhi
విడియో -
http://archive.org/details/KeeluBommaluDiscussion
రెండు లింకులకీ దారి చూపే పుట ఇదీ, -
http://archive.org/search.php?query=kalpana%20rentala

Sunday, July 01, 2012

వందేళ్ల కథ కు వందనాలు లో అయిదో గోడ కథా విశ్లేషణ

ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీ రావు గారు ప్రతి ఆదివారం హెచ్. ఏం.టీ.వీ . లో నిర్వహిస్తున్న ధారావాహిక కార్యక్రమం లో 36 వ ఎపిసోడ్ లో నా కథ " అయిదో గోడ" కథ గురించివిశ్లేషణ ప్రసారమయింది. ఈ సందర్భంగా నా ఇంటర్వ్యూ కూడా ప్రసారం చేశారు.మొత్తం ఎపిసోడ్ ను ఇక్కడ చూడవచ్చు.

http://www.hmtvlive.com/web/guest-public/videos;jsessionid=A16CC8AC0A67B064ABF375D11DD66C82.ajp13?p_p_id=VediosList_WAR_VideoSection_INSTANCE_qiu7&p_p_lifecycle=1&p_p_state=normal&p_p_mode=view&p_p_col_id=column-1&p_p_col_count=1&_VediosList_WAR_VideoSection_INSTANCE_qiu7_catId=11#


 
Real Time Web Analytics