నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Thursday, May 27, 2010

అన్నమయ్య ను స్మరిస్తూ....

పదకవితా పితామహుడు, తొలి వాగ్గేయ కారుడు తాళ్ళపాక అన్నమాచార్య జయంతి సందర్భంగా ఇవాళ ఆయనను స్మరించుకుంటూ నాకిష్టమైన అభోగి రాగం లో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి ఆలపించిన మనుజుడై పుట్టి అన్న కీర్తన అన్నమయ్య అభిమానులందరి కోసం....

తృష్ణ చెప్తున్న అమ్మ చెప్పిన కథ


అమ్మ చెప్పిన కథల కోసం అన్వేషణ శీర్షిక కు వస్తున్న స్పందన చూస్తే చాలా సంతోషం గా వుంది. లలిత( తెలుగు4కిడ్స్) మధురవాణి, జ్యోతి, జయ, తృష్ణ ఇలా అందరూ తాము చిన్నప్పుడు చెప్పించుకున్న కథల గురించి, ఆ జ్నాపాకాల గురించి టపాలు రాస్తున్నారు. ఏమిటి? అంతా అమ్మాయిలే రాస్తున్నారు...అబ్బాయిలు కథలు చెప్పించుకోలేదా? లేకా గుర్తు లేవా?

ఈ శీర్షిక కోసం ఓపిక, తీరిక చేసుకొని మరీ రెండు కథలు పంపించింది తృష్ణ. అమ్మ చెప్పిన కథ చెప్పిన మరో అమ్మ తృష్ణ కి ధన్యవాదాలు.

ఈ సారి ఈ చిట్టి పొట్టి కథలు చెప్తోంది తృష్ణ ......



ఈగ కథ:

(బాగా చిన్నప్పుడు అన్నం పెడుతూ మా అమ్మ ఈ కధ చెప్పేది)

ఒక ఈగ ఇల్లు అలుక్కుంటూ తన పేరు మర్చిపోయిందట. పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి "పెద్దమ్మా పెద్దమ్మా నా పేరేమిటి?మర్చిపోయాను" అని అడిగిండట. అప్పుడు పెద్దమ్మ "నీ పేరు నాకేం తెలుసు. నా కొడుకు నడుగు " అందట. ఈగ పేదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరకు వెళ్ళి, "పేదరాసి పెద్దమ్మ కొడుకా నా పేరు నీకు తెలుసా? అన్నదట.

అప్పుడతను "నీ పేరు నాకేం తెలుసు? నా చేతిలోని గొడ్డలిని అడుగు అన్నాడట.

అప్పుడు ఈగ, "పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా,కొడుకు చేతిలో గొడ్దలా నా పేరేమిటి?" అనడిగిండట.

అప్పుడు గొడ్డలి, "నీ పేరు నాకేం తెలుసు? నేను నరికే ఈ చెట్టునడుగు" అందట.

ఈగ చెటు దగ్గరకు వెళ్ళి "పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్దలి నరికే చెట్టా, నా పేరేమిటి?" అనడిగిండట.

అప్పుడా చెట్టు "నీ పేరు నాకేం తెలుసు? చెట్టుకట్టేసిన గుర్రాన్నడుగు" అందట.

అప్పుడు ఈగ, "పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్డలి నరికే చెట్టా, చెట్టుకట్టేసిన గుర్రమా నా పేరేమిటో తెలుసా?" అనడిగిందట. అప్పుడా గుర్రం " నీ పేరు నాకేం తెలుసు? నా పొట్టలో ఉన్న పిల్లనడుగు" అందట.

అప్పుడు ఈగ, "పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్డలి నరికే చెట్టా, చెట్టుకట్టేసిన గుర్రమా, గుర్రం పొట్తలోని పిల్లా నా పేరేమిటో తెలుసా?" అనిఅడిగిండట.

అప్పుడు గుర్రం పొట్టలోంచి గుర్రపిల్ల " ఇహీ...నీ పేరు నీకు తెలియదా? నీ పేరు ఈగ" అందట.

పేరు గుర్తొచ్చిన ఈగ సంతోషంగా ఎగిరిపోయిందట.

*****************************************************************

లొట్టాయ్ కథ:

అనగనగా ఒక ఊళ్ళో సన్నగా ఉన్న ఒక అబ్బయి ఉండేవాడు. వాడిని అందరూ "లొట్టాయి" అని పిలిచేవారుట. వాడికి ఆ పిలుపు నచ్చేది కాదట. ఎవరన్నా అలా పిలిస్తే బోలెడు కోపం వచ్చేసేదట. ఒకరోజు నడుచుకు వెళ్తూంటే దారి పక్కగా ఉనా తోటకూర మొక్కలు "రివ్వు రివ్వు లొట్టాయ్..రివ్వు రివ్వు లొట్టాయ్.." అని ఊగాయిట. వాడికి కోపం వచ్చి ఆ తోటకూర మొక్కలను కోసేసి ఇంటికి తెచ్చి పులుసు వండమని వాళ్ళమ్మకు ఇచ్చాడట.

ఆ తోటకూర పులుసు ఉడుకుతూ ఉడుకుతూ "కుతకుత లొట్టాయ్..కుతకుత లొట్టాయ్..." అందట. వాడికి ఇంకా కోపం వచ్చి పులుసంతా తీసుకెళ్ళి పెరట్లో పారబోసాడుట. అది తిన్న ఆవు పాలు ఇస్తూ "చుయ్ చుయ్ లొట్టాయ్..చుయ్ చుయ్ లొట్టాయ్..." అందట. అప్పుడు లొట్టాయ్ కి ఇంకా కోపం వచ్చి ఆ ఆవును చంపివేసి చెప్పులు కుట్టించుకున్నాడట. నడుస్తూంటే ఆ చెప్పులు కూడా "కిర్రు కిర్రు లొట్టయ్..కిర్రు కిర్రు లొట్టయ్.." అనటం మొదలెట్టాయిట. అప్పుడు వాడు వాటిని దూరంగా విసిరేసాడట.

ఆ చెప్పుల్ని తిన్న కుక్క ఒకటి "భౌ భౌ లొట్టయ్..భౌ భౌ లొట్టాయ్.." అని అరవటం మొదలెట్టిండట. ఈసారి లొట్టాయికి అమితమైన కోపం వచ్చి ఆ కుక్కను పక్కనే ఉన్న బావిలో పడేసాడట. బావిలోంచి "బుడుగు బుడుగు లొట్టాయ్..బుడుగు బుడుగు లొట్టాయ్.." అని శబ్దమ్ రాసాగిందట. ఇక వాడు ఊరుకోలేక మితిమీఇన కోపంతో బావి లోకి దూకాడుట..."బుడుంగ్ లొట్టాయ్.." అని ములిగిపోయాడుట.

ఈ కధలో ఆవుని చంపాడనగానే అదేంటమ్మా, ఆవును ఎలా చంపుతాడు? తప్పు కదా? అనడిగేవాళ్ళం అమ్మను. "ఏమో మా అమ్మ అలానే చెప్పేది. "తన కోపమే తన శత్రువు" అనే నీతిని తెలిపే కథ ఇది. దీనిలో లాజిక్కులు వెతకకూడదు" అనేది అమ్మ...:)

తృష్ణ.

http://trishnaventa.blogspot.com


Tuesday, May 25, 2010

అమ్మ చెప్పిన కథల కోసం అన్వేషణ!


అమ్మ చేతి గోరుముద్దలు తినని వారు, అమ్మ చేత కథ చెప్పించుకొని వినని వారు బహుశా భూప్రపంచం లో ఎవరూ వుండరేమో! అమ్మ చెప్పిన అచ్చమైన తెలుగు కథ ఎలా వుంటుందో , తీపిదనం రుచి మళ్ళీ చూపించారు రవికిరణ్ తమ్మిరెడ్డి మధ్య నాకు మైల్ లో . అమ్మ చెప్పిన అసలు సిసలు తెలుగు కథలు మళ్ళీ చెప్పించుకోవాలని, చదువుకోవాలని, మన పిల్లలకు మళ్ళీ కథలు చెప్పాలన్న కోరిక లేనిదేవరికి? అందుకే అమ్మ చెప్పిన తెలుగు కథలు ( కేవలం తెలుగు కథలే సుమండీ!) సేకరించాలని ఒక చిరు ప్రయత్నం శీర్షిక. మీకు మీ అమ్మ చెప్పిన కథ గుర్తుంటే రాసి పంపండి. మీ బ్లాగ్ లోనే ప్రచురిస్తే ఇక్కడ లింక్ ఇవ్వండి. ఏదైనా సరే, మళ్ళీ చిన్న పిల్లలై అమ్మ వొడిని, గోరుముద్దల్ని, వెండి గిన్నెలో పెరుగన్నాన్ని, ఆకాశాన చందమామని, ఆరు బయట నులకమంచం మీద పడుకొని ఆకాశం లో నక్షత్రాల్ని లెక్కపెట్టుకున్న తీపి జ్నాపకాన్ని, మనం ఎటు నడిస్తే అటు నడిచి వచ్చి చందమామయ్య మనల్ని అబ్బురపరిచిన వైనాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుందాము.

ఒక అద్భుతమైన తెలుగు కథ కోసం, లోకం మర్చిపోతున్న మంచి రచయితల కోసం చూస్తున్నానని చెపితే, మీరు అద్భుతమైన కథ కోసం చూస్తుంటే , నేను సామాన్యమైన తెలుగు కథ కోసం చూస్తున్నానని చెప్పి ఈ కథ పంపించిన రవికిరణ్ కి ధన్యవాదాలు.

ఈ శీర్షిక లో మొదట గా రవికిరణ్ తమ్మిరెడ్డి కి వాళ్ళ అమ్మ చెప్పిన అచ్చమైన తెలుగు కథ పేను కథ ని చదవండి. ఈ కథలతో అమ్మలందరికీ జేజేలు.
పేను కథ చెప్తున్నది రవికిరణ్ తమ్మిరెడ్డి
మా అమ్మ నా చిన్నప్పుడు నాకు చాలా కథలే చెప్పింది. కథలన్నీ నేను నా కూతురుకి చెప్పేను. అన్ని కథల్లోనూ ఒక్క పేను కథ మాత్రవే అథంటిక్ తెలుగు కథ. మిగిలినవన్నీ మాయమ్మ తను చదివిన ఆంగ్ల పాఠాల్ని తెలుగు చేసి మాకు చెప్పింది. నా కూతురురికి ఇప్పుడు పదిహేనేళ్ళు, నేనాపిల్లకి ఇవి ఆంగ్ల కథలు, ఇవి తెలుగు కథలు అని చెప్ప లేదు. మా అమ్మ చెప్పిన కథలన్నీ పిల్లకి చెప్పేను. తెలుగు, ఆంగ్లం కలగలిపి. కానీ ఇప్పుడు పిల్లకి పదిహేనేల్లోచ్చినా, నువ్వది రైటంటే అది రాంగనే టీనేజి వయసొచ్చినా, ఇప్పుడు కూడా ఎప్పుడన్నా నానా పేను కథ చెప్పవా అని అడుగుతుంది. అదీ, అచ్చ తెలుగు కథ కున్న బలం.


ఒక
పేను, చక్కగా పెసర చేను వేస్తుంది. చేను ఎదిగిన తర్వాత, పెసలన్నీ ఊర్స్చి, వాటిల్తో పెసరట్లేస్తుంది. సరే పెసరట్లేసేం కదా అని, దేశపు రాజుకి కూడా ఇస్తావని కొన్ని పెసరట్లని బాక్సులో పెట్టుకుని బయలుదేరుతుంది. పేను అలా రాజు గారి దగ్గరకు పోతావుంటే, మొదట ఒక తేలొస్తుంది, పేను, పేను నాకొక పెస్రట్టియ్యవా, నేను కూదా నీకుతోడుగా రాజు గారి దగ్గరకు వస్తా అంటుంది. సరే అని అని పేను తేలుకొక పెసరట్టిస్తుంది. తర్వాత ఒక పులి, ఒకబండ రాయి, ఒక పావు అలాగే అడిగి పేనుతోపాటు రాజుగారి దగ్గరకు పోతాయి. రాజు గారి దగ్గరకి పోయిన తర్వాత, ఆయన భవనం ముందు నిలబడి పేను సేవకుడి ద్వారా రాజు గారికి తనోచ్చిన విషయం తెలుపుతుంది. కానీ రాజుగారు, అహే, పేను చేసిన పెసరట్లని, రాజుని నేను తీసుకోవడవేంది అని, అవమానంగా తలచి, ఛీ అంటాడు. పాపం పేనుచాలా అవమానం ఫీల్లవుతుంది. ఒరే రాజు నేను పేనుని, చిన్న ప్రాణిని అనేగదా నువ్వు నన్నిలా అవమానించావు, సరేనీ సంగతి చూస్తా అనుకుంటది. ఒసే తేలు నువ్వు పొయ్యి రాజు దువ్వెన పెట్టుకునే గూట్లో వుండు. పావు నువ్వు భవనం వెనక ద్వారం దగ్గర వుండు. పులి నువ్వు ముందర ద్వారం దగ్గర వుండు. బండ రాయి నువ్వు భవనంప్రక్క ద్వారం ముందున్న పందిరి మీద వుండు అని చెప్తుంది. చెప్పి సక్కా పొయ్యి రాజు గారి తల్లో చేరి కుట్టటం మొదలుపెడ్తుంది. అబ్బా జిలగా వుందని రాజు గారు దువ్వుకోడానికి దువ్వెనకోసం గూట్లో చెయ్యి పెడ్తే తేలు చటుక్కున కుడ్తుంది. అబ్బా తేలు కుట్టింది అని ముందర ద్వారం ద్వారా రాబోతే పులి అంటుంది, వెనక ద్వారం ద్వారా రాబోతే, పావుకాటేస్తానంటుంది, సరే అని ప్రక్క ద్వారం ద్వారా రాబోతే, బండరాయి నెత్తిన పడుతుంది. అప్పుడు రాజుకి విషయంతెలుస్తుంది. పేనుకు క్షమాపనలు చెప్పి, సన్మానాలు చేసి పంపిస్తాడు. ఇదీ కథ. అమ్మ చెప్పిన, అచ్చ తెలుగు కథ. దీంట్లో ఏవుంది, వుందో నాకు తెలీదు. నా మధ్య వయస్సులో నా చిన్నప్పుడు మాయమ్మ చెప్పిన కథ నాకింకాగుర్తుంది. టీనేజొచ్చిన నా కూతురు ఇంకా అప్పుడప్పుడూ ఎప్పుడన్నా నానా నాకు పేను కథ చెప్పవా అనిఅడుగుతుంది.

Friday, May 21, 2010

ఆమె రహస్యం!


ఆమె రహస్యం!

“ మీ ఇల్లు చూపించు” అన్నది ఆమె

మేము ఇంటి తలుపులు తెరవగానే.



ఇప్పుడు, ఎనిమిదో రోజు

ఇల్లంతా శూన్యం

మౌనం గా, నెమ్మదిగా,

వీడ్కోలు చెప్పటానికి నిరాకరిస్తూ


అది నా ఇల్లు

ఆమె వచ్చినప్పుడు

కానీ ఆ వీడ్కోలు తో

ఆమె వదిలి వెళ్లింది మా యింటిని


ఆ ఆగమన , నిష్క్రమణ తేడాల మధ్య

ఇప్పుడు నేను

మౌనం గా, నిశ్శబ్దం గా కూర్చొని

ఆమె రహస్యాన్ని తెలుసుకుంటూ

మూలం: క్రేజీ ఫింగర్


అనువాదం: కల్పనారెంటాల

ఈ కవిత మూలం ఇంగ్లిష్ లో ఇక్కడ చదవవచ్చు. అనువాదం చేసినప్పుడు మూలం లో వుండే తీవ్రత, ఆ పదాలకు సరైన తెలుగు పదాలు ఒక్కోసారి దొరకవని తెలిసినా, అనువాదం చేసే చిరు ప్రయత్నం ఇది.

Wednesday, May 19, 2010

ఒక మామూలు మరణం!


సునీల్ ఆ బాంబు ప్రేలుడు లో చనిపోయాడు.
అతను మాకు పండ్లు అమ్మేవాడు.
ఏ బాంబు ప్రేలుడు అని మీరడగవచ్చు.
అది నిజం గా ఏ బాంబు ప్రేలుడైతేనేం?
టౌన్ హాల్ లో ఎన్నికల ర్యాలీకి అతను వెళ్ళాడు. అప్పుడు ఆ బాంబు ప్రేలుడు సంభవించింది. సునీల్ చనిపోయాడు. అంతే. రెండు రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చినప్పుడు నాకు చెప్పిన విషయం ఇదే.
సునీల్ సోమవారం చనిపోయాడు అంతకు ముందు శనివారమే నేను అతన్ని . కాల్ పెట్టీ మార్కెట్ లో కలుసుకున్నాను.
“ పాపా” అన్నాడు అతను. నన్ను అతను అలాగే పిలుస్తాడు. నాకు ఇరవై ఏళ్ళు వచ్చినా సరే, అతను నన్ను పాపా అనే పిలుస్తాడు. నాతో మాట్లాడేటప్పుడు మా అమ్మని గురించి ప్రస్తావించాల్సి వస్తే అమ్మా అని అంటాడు కానీ ఆమె ఎదురుగా మాత్రం అలా పిలవడు.
అమ్మకు అతను పండ్లు అమ్మదల్చుకున్నప్పుడు మాత్రం “ పాప కు ఇవంటే ఇష్టం “ అంటాడు. నాకు పండ్లు అమ్మాలనుకున్నప్పుడు “ అమ్మ ఎప్పుడూ ఇవే కొంటుంది “ అంటాడు. అలాంటప్పుడు స్థానికం గా దొరికేవి కాకుండా దిగుమతి చేసుకున్న ఆరెంజ్ పండు నో , ఒక యాపిల్ నో ఈవ్ లా పట్టుకుంటాడు.
ఏమైతేనెం, ఆ శనివారం సునీల్ “ పాపా, కమలాపండ్లు కావాలా?” నన్ను అడిగాడు
“ అమ్మను అడుగుతాను” చెప్పాను నేను. “ అమ్మా!” అమ్మ వైపు తిరుగుతూ “ నీకు కమలాపండ్లు కావాలేమో అడుగుతున్నాడు సునీల్ “ అన్నాను.
అమ్మ కూరగాయల వాడి దగ్గర వున్నదల్లా సునీల్, నేనూ వున్న దగ్గరకు వచ్చింది.
అమ్మ ఎప్పుడూ ఆ కూరగాయల వాడి దగ్గర దోసకాయ, వంకాయ, పాతోలా,తలానా బాటు కొంటూ వుంటుంది.
“ కమలా పండ్లా? వద్దులే. అయినా ఎంతకిస్తున్నావు వాటిని? “ అమ్మకు ఇలా బేరం ఆడటం అంటే ఎంతో ఇష్టం. ఏవైనా సరే తనకు కొనడం ఇష్టం లేదని చెప్పడం, మళ్ళీ దేన్నైనా సరే వాటి ధరను కనుక్కోవడం ఆమెకు ఇష్టమైన పని. ఆ ధరను బట్టి ఆమె తనకు అవి కావాలో వద్దో నిర్ణయించుకుంటుంది. సునీల్ మంచి ధర చెప్పాడు. సంచీలో ఆరు కమలాపండ్లు పెట్టాడు.
“ బొప్పాయి “ అంటూ ఆశగా అమ్మ వంక చూశాడు సునీల్. ఆమె వద్దని తల అడ్డంగా వూపింది. ఆ ఆరు కమలాపండ్లకు డబ్బు చెల్లించటానికి అమ్మ తన పర్స్ బయటకు తీసింది. దానికి ప్రతిస్పందనగా సునీల్ “ పండ్ల రసం కోసం బొప్పాయి “ అన్నాడు సింపుల్ గా.
“ ఎంత?” మా అమ్మ అడిగింది. సునీల్ బొప్పాయి ని కూడా బ్యాగ్ లో పెట్టాడు. మా ఇద్దరి పక్కనే అంత సేపూ నిలబడ్డ సునీల్ నన్ను చూసి నవ్వాడు. నేను కూడా అతన్ని చూసి తిరిగి నవ్వాను. నేనూ, మా అమ్మ ఇద్దరం కారు దగ్గరకు వెళ్ళాము. ఆ రోజు శనివారం. సునీల్ సోమవారం నాడు చనిపోయాడు.
అతను ఆ స్టేజీ కి అంత దగ్గరగా ఏం చేస్తున్నాడు అని నేను ఆలోచిస్తున్నాను ఎవరితోనైనా మాట్లాడటానికి వేదిక మీదకు వెళ్లాడా? అతనికి ఇష్టమైన రాజకీయ నాయకులతో ? లేదా ఎవరైనా రాజకీయ నాయకుడి మీద కంప్లయింట్ చేయడానికా? లేదా తను వోటు వేయాలనుకున్న రాజకీయ నాయకుడి కోసమా?
ఆ బాంబు ప్రేలుడు లో పది మంది చనిపోయారు. పది మంది సాధారణ ప్రజలు. అందులో మాకు పండ్లు అమ్మే సునీల్ ఒకడు. అతనికి భార్య, నాలుగేళ్ళ కొడుకు వున్నారు. సునీల్ కి భార్య, నాలుగేళ్ళ కొడుకు వుండేంత వయస్సు వున్నట్లు నాకనిపించదు. నా కళ్ళకు అతను పంతొమ్మిది ఏళ్ల వాడిలా కనిపిస్తాడు.
డబ్బు సంపాదించేందుకు అనేక అవకాశాలున్న విదేశాలకు అమ్మ తన మొదటి సంతానాన్ని చూసేందుకు వెళ్ళినప్పుడూ సునీల్ కి, నాకూ మధ్య మంచి వొప్పందం కుదిరింది. నేను ఆఫీస్ కి వెళ్ళబోయేముందు, ఉదయం ఎనిమిది గంటలకు సునీల్ వచ్చేవాడు. కారు లో నా బ్యాగ్ పెడుతూ నాకు కావాల్సిన పండ్ల జాబితా అతనికిచ్చేదాన్ని. ఆ జాబితా లో ఆ ఋతువు కి సంబంధించిన పండ్లు అదనంగా చేరేవి. అరటిపండ్లు, కమలాపండ్లు, బొప్పాయి, పైనాపిల్ ఎప్పుడూ కొనే పండ్లు, మామిడిపండ్లూ, మాంగో స్టీన్, సీతాఫలం, అవకాడా, ఉడ్ ఆపిల్, బెల్లి, సవర్ సప్, రంబుతాన్, జామ, ఉసిరి, ద్రాక్ష పండు ఆయా ఋతువు ని బట్టి ఇంటికి వచ్చేవి. మధ్యాహ్నం భోజనం చేసేందుకు నేను ఇంటికి వచ్చినప్పుడు , సునీల్ బాధ్యత గా పండ్లు పట్టుకొని వచ్చేవాడు. అతను ఎంత చెపితే అంత డబ్బు అతనికి ఇచ్చేసేదాన్ని. మూడురోజులకొకసారి అతను మళ్ళీ రావాలన్న నిబంధనతో అతను వెళ్లిపోయేవాడు. మూడు రోజుల తర్వాత అతను తిరిగి వచ్చినప్పుడు పాడైపోయినవి, చేదు గా వున్నవి, సరిగా పండనివి, రుచి గా వుండని పండ్ల గురించి అతనికి చెప్పేదాన్ని. అందుకు ప్రతిఫలంగా అతను అదనంగా ఒక అరటిపండో, మామిడి పండో, కమలాపండో బాగ్ లో పెట్టేవాడు. నేను సునీల్ గురించి మా బంధువులకు, స్నేహితులకు పరిచయం చేయాలని ప్రయత్నించాను. కానీ అదెందుకో ఎక్కువకాలం కొనసాగేది కాదు.
మా అమ్మ తిరిగి వచ్చాక మా ఇంటికి సునీల్ రాకపోకలు ఆగిపోయాయి. మా అమ్మకు ప్రతి రోజూ మార్కెట్ కి వెళ్ళి రావడం ఓ వ్యసనం. అందుకే ఆమె సునీల్ తో “ పాప లాగా బద్దకించను నేను. రోజూ నేనే నీ పండ్ల దుకాణానికి వస్తాను.ఇంటికి రావద్దని “ సునీల్ కి చెప్పేసింది . ఈ వొప్పందం సునీల్ కి ఇష్టమో, కాదో నాకు స్పష్టం గా తెలియదు. మా అమ్మ అతని పండ్లను అతి సునిశితం గా శల్య పరీక్ష చేసి బాగా మంచి పండ్లని ఎంపిక చేస్తుంది.బొప్పాయి పండ్లను , మామిడి పండ్లను ఆమె ఎంతో అనుభవమున్న తన వేళ్ళతో పరీక్షిస్తుంది. గట్టి పిడికిలి తో వుడ్ యాపిల్స్ ని, బెల్లీస్ ని వూపి చూస్తుంది. నిర్దాక్షిణ్యం గా అవకాడా లను పిసుకుతుంది. మా అమ్మ కంటే నేనంటేనే సునీల్ కి ఎక్కువ ఇష్టమని నాకు ఖచ్చితం గా తెలుసు.
బాంబు ప్రేలుడు లో చనిపోయిన సునీల్ కొంచెం సన్నగా , పొట్టిగా వుంటాడు. నల్లటి జుట్టు ను పొట్టిగా కత్తిరించుకొని వుంటాడు. నుదుటి మీద మాత్రం కొంచెం జుట్టు పడుతూ వుంటుంది. అతనెప్పుడూ , ఎప్పుడూ పొడుగ్గా వుండే బ్యాగీ షార్ట్స్, అతని సైజు కంటే పెద్దదైన టీ షర్ట్ వేసుకుంటాడు. దీని వల్ల అతను చిన్నగా, పొట్టిగా, సన్నగా కనిపిస్తాడు.
మా అమ్మ రోజూలాగానే మంగళవారం మార్కెట్ కి వెళ్లింది. మా నాన్న ఎప్పుడూ అంటుంటారు మా అమ్మ కు కిందటి జన్మలో తప్పనిసరిగా మార్కెట్ తో ఏదో అనుబంధం వుండి వుంటుందని. అమ్మ ఫ్లూ తో బాధపడుతున్నా, మంచం మీద నుంచి కష్టంగానైనా సరే లేచి, అంత నీరసం లో కూడా తన శరీరాన్ని లాక్కుంటూ మార్కెట్ కి వెళ్తుంది. కానీ ఆ మార్కెట్ కాంపౌండ్ లోకి అడుగుపెట్టగానే ఏదో అద్భుతం జరిగినట్లు ఒక శక్తివంతమైన ఇంజెక్షన్ తీసుకున్నట్లు ఎంతో ఉత్సాహంతో , ఎంతో శక్తి తో తను రోజూ తిరిగే స్టాల్స్ అన్నింటికి వెళుతుంది. ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ఒక చిన్న సంచీ వస్తువులతో మాత్రమే వస్తుంది. ఇలా తక్కువ కొనడం వల్లనే ఆమె రోజూ మార్కెట్ కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడప్పుడూ , ఆమె మార్కెట్ నుంచి ఇంట్లోకి అడుగుపెట్టగానే, ఏదో ఒక వస్తువు మర్చిపోయినట్లు గుర్తుకు వస్తుంది. ఎవరైనా ఆమెను ఆపే లోగానే, ఆమె మళ్ళీ కారులోకి దుమికి కూర్చొని మళ్ళీ మార్కెట్ కి వెడుతుంది. అసలు మార్కెట్ పక్కనే ఇల్లు కొని వుంటే పెట్రోల్ ఖర్చు తగ్గి వుండేదని మా నాన్న అనుకుంటూ వుంటారు. మా అమ్మకు ఇల్లొక ఖైదు లా వుంటుంది. అటూ ఇటూ తిరుగుతోందని ఎవరూ నిందారోపణలు చేయకుండా ఆమె న్యాయబద్ధం గా వెళ్లగలిగిన ఒకే ఒక్క ప్రదేశం మార్కెట్ కి మాత్రమే అనుకుంటాను.
మా అమ్మ మంగళవారం మార్కెట్ కి వెళ్ళినప్పుడు మార్కెట్ లో ఒక పక్క మొత్తం తెల్ల జండాలు వేలాడుతూ వుండటం చూసింది. ఆ మార్కెట్ చాలా పెద్దది. చాలా పురాతనమైంది కూడా. నెలకొకసారి, మార్కెట్ కి సంభందించి ఎవరో ఒకరు చనిపోతుంటారు. తమ ఆత్మీయుల మరణం తో వాళ్ళు కొత్తగా పెట్టిన ఆ స్టాల్ దగ్గరకు వెళ్ళి చూసి తన సంతాపం ప్రకటించి మళ్ళీ మార్కెట్ పనిని కొనసాగిస్తుంది. ఈ సారి మాత్రం ఆమె నేరుగా కూరగాయల దుకాణానికి వెళ్ళటానికి ముందు పండ్ల దుకాణం దగ్గరకు వెళ్ళింది. ఆ దుకాణం ముందు నిల్చున్నప్పుడు తన పక్కకు వచ్చి ఓ మాంత్రికుడి దర్శనం లా సునీల్ వచ్చి నిలబడలేదని ఆమెకు గుర్తొచ్చింది.
“ సునీల్ ఎక్కడ?” అని అతని అసిస్టెంట్ ని ఆమె అడిగింది. అలా ఆమెకు , తమకు రోజూ పండ్లు అమ్మే సునీల్ టౌన్ హాల్ లో జరిగిన బాంబు ప్రేలుడు లో మరనించాడన్న సంగతి తెలిసింది. అతను వెళ్ళిన ఎన్నికల సమావేశం తర్వాత కొల్లనావ పార్లమెంట్ సభ్యుడితో మాట్లాడటానికి వేదిక కు దగ్గరగా వెళ్ళినప్పుడు సూసైడ్ బాంబర్ బాంబును ప్రేల్చగా, ఆ బాంబు ఎవరిని చంపటానికి ఉద్దేశించినదో ఆ ప్రెసిడెంట్ బదులు సునీల్ చనిపోయాడు.
౮౮౮

మూలం: శ్రీలంక రచయిత్రి అమీనా హుస్సేన్
అనువాదం : కల్పనారెంటాల
( ఈ కథ సాక్షి పత్రికలో మే పంతొమ్మిది న ప్రచురితమైమ్ది )
 
Real Time Web Analytics