నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Monday, December 07, 2009

' మూస ' పోసిన సాహిత్య చరిత్ర ఇంకెన్నాళ్ళు?



(నిడదవోలు మాలతి గారి పుస్తకానికి నేను రాసిన ముందు మాట డిసెంబర్ 7 వ తేదీ ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురితమైంది. అది ఇక్కడ మీ కోసం.... ఈ పుస్తకం పొట్టి శ్రీరాములు యూనివర్సిటి వారి దగ్గర దొరుకుతుంది. వెల రూ. 45/-.వీలున్న వారు పుస్తకం కొని చదివి మీ అభిప్రాయాలు, సూచనలు మాలతి గారికి తెలియచేయగలరు. )



వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్ర మనది. ఒక మొల్ల, మరో తిమ్మక్క అంటూ వేళ్ల మీద లెక్కించి స్త్రీలసాహిత్య చరిత్రను, వారి కృషిని ప్రధాన స్రవంతి సాహిత్య చరిత్రలో పార్శ్వ్యంగా మాత్రమే చూపించే ప్రయత్నంఇన్నేళ్ళుగా సాగింది. సాహిత్యంలోనూ, సామాజిక శాస్త్రరంగాల్లోనూ, స్త్రీల భాగస్వామ్యాన్ని పాయగామాత్రమే చూపించటానికి అలవాటు పడ్డ పురుషస్వామ్య చరిత్ర విధానం మనది. తెలుగు సంస్కృతిపైఆధునికత ప్రభావం పడ్డప్పటి నుంచి, స్త్రీల భావ ప్రపంచం మారుతూ వచ్చింది. అది సాహిత్యంలోనూ, శాస్త్ర, సామాజిక రంగాల్లోనూ ప్రతిఫలించింది. అయితే, స్త్రీలకు సంబంధించి పురుషుల ఆలోచనల్లో వచ్చినమార్పుల గురించి చెప్పినంతగా, చుట్టూ వున్న సమాజంలో స్త్రీల మేధో భాగస్వామ్యం పెరుగుతూ వచ్చినక్రమాన్ని , వారి ఆలోచనాస్రవంతిలో వచ్చిన మార్పుని వివరించిన ప్రయత్నాలేవీ అసలు జరగలేదు.


ఇప్పటివరకూ కొనసాగుతూ వచ్చిన మూస చరిత్ర రచనా విధానాన్ని ప్రశ్నించి, ప్రత్యామ్నాయ చరిత్రను రచించే క్రమం ఒకటి మొదలైంది. ఇది కేవలం నలుగురు వ్యక్తులకో, నాలుగు పుస్తకాలకో పరిమితం కావడం లేదు. స్త్రీ చైతన్య క్రమాన్ని అన్ని రంగాల నుంచి, అన్ని కోణాల నుంచి విశ్లేషిస్తున్నారు. తెలుగు సాహిత్య రంగంలో స్త్రీల విశేష కృషిని పాక్షిక దృష్టితో చూస్తూ ఓ దశాబ్ధానికో, ఒక నలుగురు రచయిత్రులకో పరిమితం చేస్తూ కొనసాగిన చరిత్రను తమ విస్తృత పరిశోధనలతో చర్చకు పెట్టే ప్రయత్నం మొదలైంది. అలాంటి ప్రయత్నం చేసిన వారిలో నిడదవోలు మాలతి ఒకరు. స్వాతంత్ర్యానంతర కాలంలో తెలుగు కధా చరిత్రను గురించి ఇప్పటివరకూ రికార్డైన సాహిత్య చరిత్రను ఆమె కొత్త దృక్కోణంలో చర్చిస్తున్నారు






తెలుగు కధా చరిత్రలో రచయిత్రులు గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా నవలా రచయత్రులుగానో, లేక 80 ల తర్వాత వచ్చిన స్త్రీవాదుల గురించో వుంటుంది తప్ప అంతకు మించిన సమగ్ర చర్చ ఎప్పుడూ జరగలేదు. స్వాతంత్ర్యానికి ముందు సంఘసంస్కరణ జాతీయోధ్యమాల కాలంలో కధానికలు రాసినంత మంది రచయిత్రులు, స్వాతంత్ర్యానంతరం రాయలేదు. ముద్రణా సౌకర్యం, మహిళా చైతన్యం, విద్యా సౌకర్యాలు పెరిగి, వస్తువైవిద్యానికి ఆస్కారం కలిగిన కాలంలో మహిళా కధకుల సంఖ్య తులనాత్మకంగా చూచినప్పుడు అంతకు ముందు కన్నా తక్కువ. స్వాతత్ర్యానంతరం మహిళలు కధానికను వదిలి నవల వైపు మొగ్గడం ఇందుకు కారణమై అంటారు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి (తెలుగు కధకులు-కధనరీతులు-మూడవ భాగం పేజీ 111). అయితే, అది తప్పని, అందరూ అనుకుంటున్నట్టు 1950 నుండి 1975 వరకూ రచయిత్రులు కేవలం నవలలు మాత్రమే రాయలేదని, అనేక మంచి కధలు రాసారని చెపుతూ వారు తీసుకున్న ఇతివృత్తాల్ని, వారి రచనా విధానాన్ని, శైలిని నిడదవోలు మాలతి తన పుస్తకం Quiet and Quaint: Telugu Women's Writing, 1950-1975 లో సమగ్రంగా చర్చించిన విధానం స్త్రీల సాహిత్య విమర్శలో ఓ మైలురాయి లాంటి ప్రయత్నం. స్త్రీవాదం అన్న పదం వాడకపోయినా, స్త్రీ చైతన్యం, స్త్రీ వ్యక్తిత్వ ప్రస్తావన అనేది కేవలం 80 ల నుండి మాత్రమే మొదలు కాలేదని, అది '50 ల తరం నాటి రచయిత్రుల్లో ఎంత స్పష్టం గా ప్రకటితమైందో ' ఎదురు చూసిన ముహుర్తం' (పి. సరళాదేవి) లాంటి కధల ద్వారా ఆమె సోదాహరణంగా చెప్పినప్పుడు వెనకటి తరం రచయిత్రుల కృషి మీద మరింత గౌరవ భావం కలుగుతుంది.



గురజాడ వారి ' దిద్దుబాటు ' తొలి తెలుగు కధగా పేర్కొంటూ ఇప్పటిదాకా ప్రచారమైన తెలుగు కధా చరిత్రలో తొలితరం రచయిత్రులకున్న ప్రాధాన్యత అతి స్వల్పము. భండారు అచ్చమాంబ తొలి తెలుగు కధకురాలన్న గుర్తింపు ఇటీవలి కాలంలో వెలుగు చూసిన కఠోర సత్యము. ప్రధానా స్రవంతి కధాసాహిత్య విమర్శల్లో, తొలితరం తెలుగు కధానికా సంకలనాల్లో గురజాడ, శ్రీపాద, మల్లాది గురించి చెప్పినంతగా ఎవరూ ఈ నాటికి కూడా భండారు అచ్చమాంబ, కనుపర్తి వరలక్ష్మమ్మ, ఇల్లిందల సరస్వతీదేవి, శివరాజు సుబ్బలక్ష్మి,పి.శ్రిదేవి,ఆదిమధ్యం రమణమ్మ మొదలైన రచయిత్రుల గురించి ఎవరూ ఎక్కడా చెప్పలేదు, చర్చించలేదు.కధకు సంభందించిన చర్చలన్నింటిలోనూ, '50ల నాటి రచయిత్రుల ప్రస్తావనలు దాదాపుగా ' నాంకే వాస్తే ' పద్ధతిలో మాత్రమే కనిపిస్తాయి. తెలుగు కధ మీద ఇప్పటివరకూ వచ్చిన అనేకానేక పుస్తకాలు, అనేకానేక వ్యాసాలు పరిశీలించినప్పుడు వారి కృషి ఓ ముగ్గురి, నలుగురి పేర్లతో ........ఫలానా వారు కూడా రాసేవారు అంటూ ఏకవాక్యానికే పరిమితం కావడం చూడవచ్చు. వారి కధల గురించి, వాటి ఇతివృత్తాలు, శైలి మొదలైన వాటి గురించి సీరియస్ గా ఎవరూ చర్చించినట్టు మనకు ఎక్కడా దఖాలాలు లేవు. మరీ కాకుంటే మొత్తం రచయిత్రులందరి గురించి ఒక వ్యాసం వుంటుంది కానీ ప్రధాన సాహిత్య చరిత్రలో భాగంగా తొలి తరం రచయిత్రుల కృషిని సమగ్రంగా విశ్లేషిచినట్ట్లు కనిపించదు. నిస్సందేహంగా గురజాడ, మల్లాది, శ్రీపాద గొప్ప రచయతలే కానీ రచయిత్రుల కధల్ని గురించి చర్చించినప్పుడు కదా వారు కూడా దీటుగా కధలు రాయగలిగారా, లేదా అన్న సంగతి అర్ధమయ్యేది.






గురజాడ ' దిద్దుబాటు ' ని, భండారు అచ్చమాంబ ' స్త్రీవిద్య ' లేదా 'ఖన ' లాంటి కధల్ని పక్కన బెట్టి చూసినప్పుడు దిద్దుబాటు కంటే ఆ కధలు ఏ రకంగానూ తీసిపోవన్న నగ్నసత్యం బోధపడుతుంది. 1900 నాటికే విద్యావంతురాలైన భండారు అచ్చమాంబ రాసిన స్త్రీల చరిత్రను, ఆమె రాసిన కధల్ని ఎవ్వరూ కూడా సీరియస్ గా పరిగణనలోకి తీసుకోనందువల్ల ఆమె కృషి విస్మృత చరిత్రగా మిగిలిపోయింది. విక్రమాదిత్యుని ఆస్థానంలోని జ్యోతిశ్శాస్త్రవేత్త మిహిరుని భార్య ఖనా కు ఎలాంటి దుర్గతి పట్టిందో చెపుతూ అచ్చమాంబ రాసిన కధ స్త్రీలు అప్పటికే సమాజం లో తమ స్థితిగతుల్ని గుర్తించారనటానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఐరోపా మహాసంగ్రామానంతర దుస్థితిని, మాంచెస్టర్ నూలు మిల్లులు వచ్చి దేశీయ పరిశ్రమలు దెబ్బతీసిన వైనాన్ని, జాతీయోద్యమ ప్రాముఖ్యాన్ని ఓ తల్లి పాత్ర ద్వారా చెప్పించిన కనుపర్తి వరలక్షమ్మ లాంటి రచయిత్రుల్ని, ' కుటీరలక్ష్మి ' (1924) లాంటి కధల్ని పట్టించుకున్న వారు తక్కువే. తొలి తరం స్త్రీల సాహిత్య కృషిని అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా పురుష నిర్మిత సాహిత్య విమర్శనా పనిముట్లతో పరామర్శిస్తూ స్త్రీలు ఇతర స్త్రీల కోసం రాసుకుంటున్న వాటిగానే చూస్తున్నరు తప్ప వారి సాహిత్యానికి ప్రధాన స్రవంతి చరిత్రలో సరైన ప్రాతినిద్యం ఇవ్వలేదన్నది నిష్టూర సత్యం.

స్వాతంత్ర్య, సంస్కరణోద్యమాలు, పత్రికల వ్యాప్తి, స్త్రీవిద్యలో భాగంగా మాత్రమే రచయిత్రుల్ని చూస్తారు తప్ప అంతకుమించి వారి సాహిత్యానికి ప్రత్యేకత ఏమి ఇచ్చినట్టు కనిపించదు. ఆనాటి స్త్రీలు తాము చదువుకొని సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకున్న సంగతి కంటే కూడా స్త్రీలు చదువుకోవాలని, అది ' కుటుంబానికి ' చాలా ప్రయోజనకరమంటూ మగవారు ప్రోత్సహించిన దానికే చరిత్రలో ఎక్కువ ప్రాముఖ్యం లభించింది. స్త్రీ విద్య, స్త్రీ అభివృధ్ధి కోసం కంటే కూడా ఇంటిని చక్కదిద్దటానికి, పిల్లల్ని బాగా పెంచడానికి మాత్రమే సంస్కరణవాదులు కోరుకున్నారు. వ్యక్తిగా ఆమె వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశంగా స్త్రీవిద్యను సంస్కరణవాదులు భావించినట్టు కనిపించదు. స్త్రీవిద్య గురించి గురజాడ కున్న పాక్షిక దృష్టిని మాలతి తన పుస్తకంలో తేటతెల్లం చేశారు.


స్వాతంత్ర్యోద్యమం తర్వాత 1950-75 అతి ముఖ్యమైన కాలము. రాజకీయార్ధిక, సామాజిక రంగాల్లో వచ్చిన అనేకానేక మార్పులు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిఫలించిన కాలం అది. అలాంటి కాలాన్ని నవలాయుగంగానో, కేవలం కల్పనాసాహిత్యంగానో సాహిత్య చరిత్రకారులు నిర్ధారించి పక్కనపెట్టేశారు. ఆ కాలంలో రచయిత్రులు రాసిన అనేకానేక నవలల్లో మంచి నవలలు అనేకం వచ్చినప్పటికీ, స్త్రీ,పురుష సంబంధాలకు, కుటుంబ జీవనానికి సంబంధించి అతి ముఖ్యమైన సున్నితమైన సమస్యల్ని ఈ నవలలు చర్చించినప్పటికి పురాణం సుబ్రమణ్య శర్మ లాంటి వాళ్ళు సీనియర్ విమర్శకులు కూడా సద్విమర్శ చేయలేకపోయారు.


స్వాతంత్ర్యోద్యమం తర్వాత 1950-75 అతి ముఖ్యమైన కాలము. రాజకీయార్ధిక, సామాజిక రంగాల్లో వచ్చిన అనేకానేక మార్పులు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిఫలించిన కాలం అది. అలాంటి కాలాన్ని నవలాయుగంగానో, కేవలం కల్పనాసాహిత్యంగానో సాహిత్య చరిత్రకారులు నిర్ధారించి పక్కనపెట్టేశారు. ఆ కాలంలో రచయిత్రులు రాసిన అనేకానేక నవలల్లో మంచి నవలలు అనేకం వచ్చినప్పటికీ, స్త్రీ,పురుష సంబంధాలకు, కుటుంబ జీవనానికి సంబంధించి అతి ముఖ్యమైన సున్నితమైన సమస్యల్ని ఈ నవలలు చర్చించినప్పటికి పురాణం సుబ్రమణ్య శర్మ లాంటి వాళ్ళు సీనియర్ విమర్శకులు కూడా సద్విమర్శ చేయలేకపోయారు. ' తెలుగు కధ-సామాజిక స్పృహ ' అన్న అంశం మీద రాసిన వ్యాసంలో " చాలా మంది రచయిత్రులు తమ కధల్లో స్త్రీతో ముడిపడిన మేరకు పురుషుని చిత్రించగలుగుతున్నారు కానీ పురుష ప్రపంచం గురించి వారికి బొత్తిగా ఏమి తెలియదని వారి రచనల్ని చూస్తే తెలిసిపోతుంది. మేధాశక్తి లేదు. భాషా దారిద్ర్యం అపారం. ఏమి చదవరు. ఆత్మస్తుతి,పరనింద, అహంకారం మూర్తీభవించిన నిర్జీవ ప్రతిమలు-తెలుగు నవలామణులు. వీరు ప్రారంభించిన అయోమయ శకం తెలుగు పాఠకుల స్థాయిని దిగజార్జేసి గడియారాన్ని యాభై ఏళ్ళు వెనక్కు తిప్పింది"(తెలుగు కధ విమర్శానాత్మక వ్యాస సంపుటి- అంధ్రసారస్వత సమితి ప్రచురణ, 1974)అని పురాణం బాహాటంగా, నిసిగ్గుగా అనగలిగారు. అయితే ఆ పురాణం గారే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులను 1976 లో అనేక సాహిత్య ప్రక్రియలకు ప్రకటించి అందులో ఫిక్షన్ కేటగిరి ని వదిలేసినప్పుడు ఆంధ్రజ్యొతి వారపత్రికలో (19 నవంబర్, 1976) రాసిన లేఖ చదివినప్పుదు ఆశ్చర్యపోతాము


ఆ లేఖ సారాంశం ఇది. " గతంలో అకాడమి అవార్డ్ పొందిన నవలలు ఉత్తమైన రచనలు అయి వుండవచ్చు.అంతమాత్రాన ఇప్పుడు ప్రచురితమవుతున్న నవలలుకూడా వాటికి నాణ్యతా ప్రమాణాల్లో ఏమాత్రం తీసిపోవు. ఉదాహరణకి, మాదిరెడ్డి సులోచన తెలంగాణ జీవితాన్ని చిత్రించే అద్భుతమైన నవలలు రాశారు. వాటిల్లో మచ్చుకు కొన్ని తరం మారింది, పూల మనసులు, మతము-మనిషి. అలాగే యద్దనపూడి సులోచనారాణి ఆంధ్రుల అభిమాన నవలారచయిత్రి. ఆమె నవలలు జీవన తరంగాలు, బందీ, ప్రేమలేఖలు ఆమె రాసిన మంచి నవలల్లో కొన్ని. ఈ నవలల్లో ఏదో ఒకటైనా మీ అవార్డ్ ప్రమాణాలకు సరితూగుతాయి. అంతే కాకుండా డి. కామేశ్వరి, పరిమళా సోమేశ్వర్ ,ఐ.వి.యస్. అచుత్యవల్లి లాంటి ఇంకెందరో నవలా రచయిత్రులు కూడా మంచి నవలలు రాసారు. తెలుగు నవలా యుగంలో రికార్డ్ స్థాయిలో పబ్లిషర్లు 300 కొత్త నవలలు ప్రచురించారు". ఇక్కడ మనకు రెండు విషయాలు బోధపడతాయి. ఒకటి తెలుగు నవలా స్వర్ణ యుగంలాంటి సమయంలోనే మంచి నవలలు రాసినా కూడా ఏ మహిళా రచయిత్రి కూడా సాహిత్య అకాడమి అవార్డ్ కు అర్హురాలు కాకపోవడము. రెండొ విషయము...ఒక పత్రికా సంపాదకుడు, అగ్రశ్రేణి సాహిత్య విమర్శకుడైన పురాణం లాంటి వారు స్త్రీల సాహిత్య సృజనకు సంబందించి ఎంత నాసిరకమైన అభిప్రాయాలు కలిగివున్నారో కూడా మనకు అర్ధమవుతుంది.


అలాగే కధకుడు, విమర్శకుడు కేతు విశ్వనాధరెడ్డి ఒక చోట " రచయిత్రులు నవల జోలికి వెళ్ళినంతగా కధానిక జోలికి వెళ్ళలేదు. శ్రీదేవి, సరళాదేవి, తురగా జనకీరాణి, కళ్యాణ సుందరీ జగన్నాధ్, వాసిరెడ్డి సీతాదేవి, ఆచంట శారదాదేవి, పవని నిర్మల ప్రభావతి, నిడదవోలు మాలతి, రంగనాయకమ్మ వంటి రచయిత్రులు కూడా కధానిక శిల్పంలో సాధించిన ప్రత్యేకత వుందని చెప్పలేం. దానికి కారణం ఆధునికి చైతన్యాన్ని అలవర్చుకోవటంలో పురుషుల కంటే స్త్రీలు ఇంకా వెనుకబడి వుండటమే. అయితే దౌర్భాగ్యం ఏమిటంటే తెలుగు రచయిత్రులు కధనసారళ్యంలో కూడా ప్రత్యేకంగా సాధించిందేమి లేకపోవడమే" అని వ్యాఖ్యానిస్తారు.(దృష్టి -సాహిత్య వ్యాస సంపుటి -పేజీ 73)
తెలుగు కధానికకు సంభందించి చర్చలు జరిగినప్పుడల్లా విమర్శకులు రాసే మాటలు పైన చెప్పుకున్నట్టు వుంటాయి. తెలుగు నాట సాహిత్య విమర్శ వ్యక్తుల్ని బట్టి, కాలాన్ని బట్టి రకరకాలుగా ఎలా మారుతూ వుంటుందో చెప్పటానికి ఇవి కొన్ని వుదాహరణలు మాత్రమే.


ఇలాంటి సాహిత్య విమర్శలు అలవాటైన తెలుగు సాహిత్య లోకానికి అతి ముఖ్యమైన ఓ పాతికేళ్ళ కాలంలో స్త్రీల సాహిత్య కృషిని, అప్పటి సామాజిక సందర్భానికి అన్వయిస్తూ వస్తుపరంగా, రూపపరంగా, శైలీపరంగా విశ్లేషిస్తూ నిడదవోలు మాలతి రాసిన Quiet and Quaint: Telugu Women's Writing, 1950-1975 పుస్తకం అసలైన తెలుగు సాహిత్య చరిత్రను గురించి పరిశోధించేవారికి మరింత బాగా వుపయోగపడుతుందనటం అక్షర సత్యం.
( తెలుగు విశ్వవిద్యాలయం వారు త్వరలో ప్రచురించనున్న నిడదవోలు మాలతి రాసిన Quiet and Quaint: Telugu Women's Writing, 1950-1975 పుస్తకానికి రాసిన ముందు మాట నుంచి...)

కల్పనారెంటాల
September 27,2004
Madison, Wisconsin

3 వ్యాఖ్యలు:

cartheek said...

కల్పన అక్క (నన్ను మీ తమ్ముడులా అనుకుంటారని ఆశిస్తున్నాను)..
ముందు మాట మొత్తం చదివాను చాలా బాగా రాసారు.. నేను ఈ పుస్తకం కచ్చితంగా కొనాలి అనుకుంటున్నాను.. ఇదేంటి కచ్చితంగా అనుకుంటున్నారా? నే ఇంతవరకు ఏ భాషలోనూ ఒక్క పుస్తకంకూడా చదవలేదు (అవసరం రాలేదు)... అప్పుడప్పుడు మంచి మంచి బ్లాగులు చదువు తాను అంతే... మీరు చెప్పిన రచయిత్రుల పేర్లలో నాకు ఒక్కటి మాత్రమే తెలుసు , రంగనాయకమ్మ గారు (ఆవిడ రాసిన "ప్రేమ కన్న మదురమైనది " పుస్తకం ఒకసారి ఫ్రెండ్ దగ్గరుంటే చదివాను అండి )....

ఇకపోతే
పురాణం సుబ్రమణ్య శర్మ గారి విమర్శా
"చాలా మంది రచయిత్రులు తమ కధల్లో స్త్రీతో ముడిపడిన మేరకు పురుషుని చిత్రించగలుగుతున్నారు కానీ పురుష ప్రపంచం గురించి వారికి బొత్తిగా ఏమి తెలియదని వారి రచనల్ని చూస్తే తెలిసిపోతుంది. మేధాశక్తి లేదు. భాషా దారిద్ర్యం అపారం. ఏమి చదవరు. ఆత్మస్తుతి,పరనింద, అహంకారం మూర్తీభవించిన నిర్జీవ ప్రతిమలు-తెలుగు నవలామణులు. వీరు ప్రారంభించిన అయోమయ శకం తెలుగు పాఠకుల స్థాయిని దిగజార్జేసి గడియారాన్ని యాభై ఏళ్ళు వెనక్కు తిప్పింది"

సుబ్రమణ్య శర్మ గారు ఎవరో నాకు తెలియదు కాని
"చాలా మంది రచయిత్రులు తమ కధల్లో స్త్రీతో ముడిపడిన మేరకు పురుషుని చిత్రించగలుగుతున్నారు కానీ పురుష ప్రపంచం గురించి వారికి బొత్తిగా ఏమి తెలియదని వారి రచనల్ని చూస్తే తెలిసిపోతుంది. " ,
ఈ విమర్శా మాత్రం పాతకాలపు స్త్రీలకు సంబందిన్చినంతవరకు నే ఒప్పుకుంటాను
ఎందుకంటే ఆ రోజుల్లో స్త్రీలకు కట్టుబాట్ల సంకెళ్ళు వేసి కూర్చోబెట్టారు ఇంట్లో,వంటింట్లో కాబట్టి తనకు తన స్వేచాకోసంపోరాదవలసి వచ్చింది (అది పురుషుడి వలన కలిగిన విఘాతం ) కాని పురుషుల గురించి ఎక్కువ రాయాలి, ఆలోచించాల్సిన అవసరం రాలేద.

తరువాతి పంక్తులు
"మేధాశక్తి లేదు. భాషా దారిద్ర్యం అపారం. ఏమి చదవరు. ఆత్మస్తుతి,పరనింద, అహంకారం మూర్తీభవించిన నిర్జీవ ప్రతిమలు-తెలుగు నవలామణులు. వీరు ప్రారంభించిన అయోమయ శకం తెలుగు పాఠకుల స్థాయిని దిగజార్జేసి గడియారాన్ని యాభై ఏళ్ళు వెనక్కు తిప్పింది"

ఇది ఎంత గొప్ప సుబ్రమణ్య శర్మ గారే కాదు, ఆ భగవంతుడే దిగొచ్చి చెప్పినా తప్పు పచ్చి తప్పు....
మేధాశక్తి లేక కాదు అది ఉపయోగించే అవకాశం లేక (ఒక పత్రికా ఎడిటర్ దగ్గరకు ఒక రచయిత్రి కధ రాసుకుని వెళ్లి నప్పుడు,
ఆ ఎడిటర్ ఏమి తెలుసుకోకుండా కొత్త వంటకాల అక్కడ పెట్టండి మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి అన్నాట్ట )

దీనిబట్టి అర్థమయ్యింది ఏమిటి పురుషుడి స్త్రీని ఎప్పుడు ఒకకోణం లోనే చూడగలిగాడు... ఇప్పుడు శర్మగారు చెప్పాలి ఎవరికీ మేధా శక్తి లేదో .. ఎవరి ఆలోచనా పరిజ్ఞానం ఎంతో ?

ఇకపోతే స్త్రీ గురించి ఎవ్వరు ఎం రాసినా వారి పైబడే ముద్ర ఒకటి స్త్రీవాది అని ఇదొక దౌర్బాగ్య స్థితి ,
నన్ను కూడా మొదట్లో బ్లాగులో ' నా వాణి' చూసి స్త్రీ వాది అనుకున్నారు నే మాత్రం" నే స్త్రీ వాదిని కాదు మానవతావాదిని అన్నాను"
అబ్బో మరీ అతిగా ఆవేశ పడ్డట్టున్నానే :) :)
సో ఒక మంచి పుస్తకం త్వరలో రాబోతోంది అన్న మాట :) :)

Kalpana Rentala said...
This comment has been removed by the author.
Kalpana Rentala said...

తమ్ముడూ కార్తీక్, అక్కా అన్న నీ ఆప్యాయమైన పిలుపు కి చాలా సంతోషం అనిపించింది. నాకు బ్లాగ్ లో ఇంకో తమ్ముడు వున్నాడు. వుబుసుపోక బ్లాగర్ కమల్ చక్రవర్తి.

ఇక నీ సుదీర్గమైన వ్యాఖ్య.

పుస్తకాలు చదవాల్సిన అవసరం రాకపోవడమేమిటి? పోనీలే ఇది మంచి పుస్తకం. ఈ పుస్తకం తో మొదలుపెట్టు. శుభారంభం.

ఇక ఫురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ప్రముఖ రచయత, పత్రికా సంపాదకుడు. ఇప్పుడు ఆయన కీర్తిశేషులు.

" పురుషుడు స్త్రీని ఎప్పుడూ ఒక కోణం లోనే చూశాడు". చాలా సందర్భాల్లో అది నిజం.

" ఇకపోతే స్త్రీ గురించి ఎవరేం రాసినా స్త్రీవాది అని ముద్ర వేయటం" ఇది కూడా నూటికి నూరు శాతం కరెక్ట్. నువ్వు మానవతావాదినన్నావు. నిజమే స్త్రీవాదం, దళిత వాదం, మైనార్టీ వాదం అన్నింటింలోనూ ఒక మానావతావాదపు స్పర్శ వుంటుంది.

 
Real Time Web Analytics